విశాఖపట్నంలో విషవాయువు లీక్ అయిన సంఘటనపై సమాధానం చెప్పలేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు దేవులపల్లి అమర్ జాతీయ మీడియా ముందు తెల్లమొఖం వేశాడు. టైమ్స్ నౌ న్యూస్ అవర్ లో మోడరేటర్, సీనియర్ జర్నలిస్టు నావికా కుమార్ అడిగిన ప్రశ్నలకు దేవులపల్లి అమర్ సమాధానం చెప్పలేకపోవడంతో నీలాంటి ఎడ్వజర్లను పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పి నావికా కుమార్ ముగించారు.
విశాఖపట్నంలో విషవాయువు లీక్ అయి ఇప్పటికి 10 మంది మరణించడం, వందలాది మంది అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ఈ సంఘటనపై బాధితులను కలిసేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్లిన విషయం కూడా తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మరో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఎన్ని రోజులలోపు నివేదిక ఇస్తుందని టైమ్స్ నౌ ప్రతినిధి నావికా కుమార్ సలహాదారుడు దేవులపల్లి అమర్ ను ప్రశ్న అడిగారు.
ఆ ప్రశ్నకు అమర్ సమాధానం చెప్పకపోవడంతో అదే ప్రశ్నను ఆమె రెండు మూడు సార్లు అడిగారు. హైదరాబాద్ లో కూర్చుని నేను సమాధానం చెప్పలేనని అమర్ అన్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నందున ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత సమాధానం చెప్పకపోతే ఎలా అని నావికా కుమార్ ప్రశ్నించారు.
అయితే తాను 44 ఏళ్ల నుంచి జర్నలిస్టుగా ఉన్నానని, నీకన్నా సీనియర్ అని అమర్ అనడంతో నీ సీనియారిటీ గురించి నీ జర్నలిజం అనుభవం గురించి కాదు నేను అడిగేది విశాఖ పట్నం సంఘటనపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుందో చెప్పండని మళ్లీ అడిగారు.
దానికి సమాధానం చెప్పకపోగా తన సీనియారిటీ గురించే చెబుతుండటంతో నావికా కుమార్ మాట్లాడుతూ నీలాంటి సలహాదారులు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పారు. నేను టైమ్స్ నౌకు సలహాదారుడిని కాదని అమర్ మళ్లీ రెట్టించి సమాధానం చెప్పడంతో నీలాంటి వాళ్ల సలహాలు మాకు అవసరం లేదని నావికా కుమార్ చెప్పారు. మొత్తానికి జరిగిన దారుణమైన సంఘటన పై జాతీయ మీడియాను అమర్ ఎదుర్కొనలేక పోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. అసలే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పాలనపై వ్యతిరేక కథనాలు జాతీయ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. ఈ దెబ్బతో అవి మరింత పెరగవచ్చు.