ప్రతి సారీ దుందుడుకు వైఖరి ప్రదర్శించే చైనా ఇప్పుడు నేపాల్ భూభాగంలోకి చొరబడింది. ఈ విషయం నేపాల్ ప్రభుత్వమే వెల్లడించింది. అయితే ఈ విషయం స్థానిక వార్తా సంస్థ ద్వారా వెల్లడైందని, దీన్ని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని బిబిసి వార్తా సంస్థ వెల్లడించింది. నేపాల్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న హుమ్లా జిల్లాలోని కొంత భూభాగాన్ని చైనా అతిక్రమించిందని నివేదిక పేర్కొంది.
హుమ్లా జిల్లాలోని భూభాగాల్లో సరిహద్దు వివాదంపై దర్యాప్తు చేయడానికి గత సెప్టెంబర్లో నేపాల్ ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిన తర్వాత నివేదిక విడుదలైంది. కేవలం భవనాలు మాత్రమే కాకుండా సరిహద్దు వెంబడి కంచె, కాలువ నేపాల్ వైపు ఒక రహదారి నిర్మించబడిందని కూడా ఆ సంస్థ పేర్కొంది. ఈ ప్రాంతంలో చైనా అనేక భవనాలను నిర్మించిందని కూడా అనధికార నివేదిక స్పష్టం చేసింది.
చైనా దురాక్రమణపై పరిశీలన చేయడానికి నేపాల్ ప్రభుత్వం హుమ్లాకు ప్రతినిధుల బృందాన్ని పంపింది. ప్రతినిధుల బృందంలో పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. ఆ ప్రాంతంలో చైనా భవనాలు నిర్మించిందని, అయితే అవి చైనా సరిహద్దులో ఉన్నాయని ప్రతినిధులు తర్వాత గుర్తించారు.
అన్ని ఆరోపణలను చైనా వెంటనే ఖండించింది. “ఎలాంటి వివాదమూ లేదు. తప్పుడు వ్యక్తిగత నివేదికలతో నేపాలీ ప్రజలను తప్పుదోవ పట్టించరని ఆశిస్తున్నాం’’ అని ఖాట్మండులోని చైనా రాయబార కార్యాలయం బీబీసీ ప్రశ్నకు సమాధానంగా పేర్కొంది. హుమ్లా హిందువులకు, బౌద్ధులకు గౌరవప్రదమైన పవిత్ర స్థలం అయిన కైలాష్ పర్వతానికి సమీపంలో ఉంది.