కరోనా మహమ్మారిని జయించి పలువురు పోలీస్ అధికారులు తిరిగి విధుల్లో చేరుతూ కరోనా వారియర్లుగా అభినందనలు అందుకుంటున్నారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన నల్లగొండ ట్రాఫిక్ సిఐ దుబ్బ అనీల్ కుమార్ కరోనా మహమ్మారిని మనోధైర్యం, డాక్టర్ల సూచనలతో జయించి శనివారం తిరిగి విధుల్లో చేరారు.
విధుల్లో చేరిన ఆయనకు ఎస్.ఐ. నర్సింహా రావు, సిబ్బంది శాలువా కప్పి గులాబీలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తుల పట్ల ఎవరు చిన్న చూపు ప్రదర్శించవద్దని, వారికి ధైర్యం చెప్పి త్వరగా కోలుకునేలా సూచనలు ఇవ్వాలని కోరారు.
కోవిడ్ సోకిన వ్యక్తులు మనోధైర్యం కోల్పోవద్దని బలవర్ధకమైన, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు వైద్యులు సూచించిన అన్ని రకాల మందులను వాడుతూ స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను జయించవచ్చని తెలిపారు. తిరిగి విధుల్లో చేరడం ఎంతో సంతోషం కలిగిస్తుందని, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలలో కోవిడ్ 19 పట్ల అవగాహన కల్పించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ. నర్సింహా రావు, ఏ.ఎస్.ఐ. నర్సిరెడ్డి, సిబ్బంది మహేందర్, జాన్సన్ పాల్, గోవింద రాజు, మహేష్, లక్ష్మీ నారాయణ, రఘు, డేవిడ్ రాజు, వెంకన్న తదితరులున్నారు.