కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరిగే “సేవ్ ఇండియా” ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని సూర్యాపేట జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్ర మున్సిపల్ కార్యాలయం కమిషనర్ బి.నాగిరెడ్డికి వినతి పత్రం ఇచ్చిన అనంతరం రోషపతి మాట్లాడుతూ రైల్వేలని బొగ్గుగనులని ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కరోనా నివారణలో ప్రాణాలు పణంగా పెట్టి సేవచేసి ముందు వరుసలో ఉన్న వారందరినీ పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు అప్పులను రద్దు చేయాలని అందరికీ కరోనా వైద్య పరీక్షలు చేయాలని, కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని ఆయన కోరారు. చట్టాల సవరణ పనిగంటలు పెంపు నిలుపుదల చేయాలని, అధికంగా పెంచిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించాలని, బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇంటి వద్దకే పంపించాలని, ప్రతి పేదవాడికి నెలకి 7,500 చొప్పున ఆరు నెలలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అర్హులైన కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని రోషపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిమెంట్ పరిశ్రమలలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు యలక సోమయ్యగౌడ్ ,వెంకన్న, ఎల్లయ్య,కోటమ్మ ,లాలయ్య, గోవిందమ్మ ,నాగరత్నం, చంద్రకళ, వీరమ్మ, నాగమణి, దుర్గారావు, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.