మూడున్నరేళ్ళ వైకాపా పాలనలో వెనుకబడిన బీసీ కులాలకు ఏం చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జయహో బీసీ సభలో చెప్పలేకపోయారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. వెనుకబడిన కులాలను వెన్నెముక కలిగిన కులాలు అంటూనే వారి వెన్నెముకను విరిచేశారన్నారు.ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలను మోసం చేసినట్లుగానే, బీసీ కులాలను కూడా మోసం చేశారని ఆరోపించారు. నిధులు, అధికారాలు లేని కార్పొరేషన్ల వల్ల ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించారు. అధికారాన్ని ముఖ్యమంత్రి సామాజిక వర్గం గుప్పెట బంధించి బిసీలకు ఏదో చేస్తున్నామని మాయ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పలు రకాల పనుల ద్వారా ప్రజల ముక్కు పిండి వసూలు చేసిన సొమ్ము, తెచ్చిన లక్షల కోట్ల అప్పులతో నవరత్నాలకు కేటాయిస్తున్నారని, అవి కూడా పూర్తి స్థాయిలో అందటం
లేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 19% అప్పులు చేశారని, తమ ప్రభుత్వం కేవలం 15% అప్పులు మాత్రమే చేసిందని ముఖ్యమంత్రి అంటున్నారని , అప్పులు తక్కువ చేస్తే మూడున్నరేళ్ళల్లో 8 లక్షల 72 వేల కోట్లకు అప్పు ఎందుకు పెరిగిందో చెప్పాలని, 49వేల కోట్ల ఏడాది రుణ పరిమితిని ఆరునెలలకే ఎలా వాడారని ప్రశ్నించారు. బిసీ కులాల చేతి వృత్తులను కూడా అవమాన పరిచారన్నారు. నాయకుల ప్రసంగాలు ముందస్తు ఎన్నికలకు సంకేతాలుగా ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. ప్రతి పక్షాలను తిట్టటం, సిఎంను పోటీలు పడి పొగడటానికే సభ పెట్టారని చమత్కరించారు.