రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను తొలగించే విధంగా తీసుకువచ్చిన జీవో ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. జీవో ను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు కార్మికుల పొట్ట కొట్టే జీవోను తీసుకురావడం దారుణమని అన్నారు.
ఉన్నఫలంగా కార్మికులను తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన చెందారు.10 సంవత్సరాల లోపు అనుభవం కలిగిన కార్మికులందరినీ తొలగించే జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సి.హెచ్ ఓబయ్య, కే.ప్రసాద్, పి.వెంకటరమణ, ఎం.వెంకటరమణ, ఎం.రెడ్డయ్య, బాలాజీ, పెంచలయ్య, లక్ష్మీదేవి, సాలమ్మ, ప్రమీల, మధు తదితరులు పాల్గొన్నారు.