రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందేమీ లేదని YSR తెలంగాణ పార్టీ జహీరాబాద్ పార్లమెంటరీ కన్వీనర్ బొరుగు సంజీవ్ అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలో జరిగి బీసీ గౌరవ సభలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో బీసీలు అన్ని విధాలా అణచివేతకు గురవుతున్నారని ఆయన తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసేందుకే ఈ సభ పెట్టామని ఆయన తెలిపారు. తెలంగాణ పోరాటంలో బీసీల పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు.
తెలంగాణ వస్తే బంగారం పళ్లెంలో తింటామని చెప్పి, నేడు చిప్ప చేతికి ఇచ్చిండు. అల్లుడొస్తే ఏడవంటడని చెప్పి, అందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు అని కేసీఆర్ దగా చేసిండు. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తమని, 57 ఏండ్లు దాటితే పెన్షన్ ఇస్తమని మోసం చేశారు. సీఎం కేసీఆర్ పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.
ఏడేండ్లలో 7వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వందలాది మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకున్నారని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఆయన విమర్శించారు.