దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత ఐదేళ్లలో సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రియల్ టైమ్ గవర్నెన్స్ ను ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్ధం కావడం లేదని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు.
రాజకీయాలకు అతీతంగా రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదని, అదంతా ప్రభుత్వ పరంగా చేసినదేని అరవిందబాబు అన్నారు.
చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టింది కాబట్టి తాను వాడుకోరాదు అనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉండాల్సిన అవసరం లేదని, ప్రజలకు సేవ చేసేందుకు రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ఎక్కువ వీలుకలుగుతుందని ఆయన అన్నారు.
RTGSకు అనుసంధానంగా 13 జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. RTGS ద్వారా ముఖ్యమంత్రి అన్ని ప్రభుత్వ శాఖలతో అనుసంధానం కావచ్చు. డ్రోన్ కెమెరా ద్వారా మండల ,గ్రామ స్థాయి కి వెళ్లి అన్ని రకాల పనులు పర్యవేక్షంచవచ్చు.
అదే విధంగా విజయవాడలో 24/7 కాల్ సెంటర్ తో RTGS అనుసంధానం అయి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో RTGS టెక్నాలజీ ని ప్రభుత్వం ఉపయోగించు కోవచ్చునని ఆయన అన్నారు. గతంలో జరిగిన తిత్లీ తుఫాను, కృష్ణా పుష్కరాల సమయంలో అద్భుత పనితీరు కనపరచిన ఈ RTGS వ్యవస్థ రాష్ట్రపతి ప్రశంసలను సైతం పొందింది.
కరోనా విపత్తు వేళ ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అరవిందబాబు అన్నారు. 2017లో సెప్టెంబర్ 6న చంద్రబాబునాయుడు ఈ వ్యవస్థను ఆరంభించారని దీని వలన రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ వ్యవస్థ ద్వారా తెలుసుకొవచ్చునని అన్నారు.
తద్వారా ప్రజలకు మరింత సేవ చేయవచ్చునని ఆయన అన్నారు. ఈ వ్యవస్థ ను ఉపయోగించుకుంటే జగన్ ప్రభుత్వానికి క్షేత్ర స్థాయిలో వాస్తవాలు కూడా తెలుస్తాయని అరవిందబాబు తెలిపారు.