అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్యవ్యస్తంగా మారిందని బిజెపి మహిళా మోర్చా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు పేడాడ సూర్యకుమారి అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ సూచనల మేరకు నగరంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలను రెండో రోజు బుధవారం పరిశీలించినట్లు సూర్యకుమారి తెలిపారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో వ్యవస్థ బలహీనపడిందని, నగరంలోని కొన్ని కేంద్రాలు మాత్రమే పిల్లలు, గర్భిణులు, బాలింతలతో సక్రమంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా చాలా కేంద్రాలు అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దూదివారి వీధి, తుమ్మావీధి, బర్మా కాలనీకి సంబంధించిన మూడు అంగన్వాడీ కేంద్రాలను ఒకే భవనంలో నిర్వహిస్తున్నారని తెలిపారు.
రికార్డ్స్ ప్రకారం 34 మంది చిన్నారులు కేంద్రంలో ఉండాల్సి ఉండగా 21 మంది మాత్రమే హాజరయ్యారని వివరించారు. అదే విధంగా చిన్నారులకు అందించే ఆహార పదార్థాల్లోనూ నాణ్యత లోపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఉండాల్సిన టీచర్ మరో దగ్గర విధులు నిర్వహించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. అదేవిధంగా గారవీధి, ఇలిసిపురం, రైతుబజారుకు సంబంధించిన మూడు అంగన్వాడీ కేంద్రాలను రైతుబజారు వద్ద ఓ సిమెంట్ రేకుల ఇంట్లో ఒకే చోట నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉందని, అద్దె రూ. ఆరు వేలు చెల్లిస్తున్నట్టు అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారని పేర్కొన్నారు. తాము కేంద్రానికి వెళ్లే సరికి చిన్నారులకు ఆహారం కూడా అందించలేదని, టీచర్ను అడిగితే ఉదయమే పెట్టేశామని చెబుతున్నారని వివరించారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు కేంద్రం నిర్వహిస్తున్నారని సూర్యకుమారి చెప్పారు.
ఇక్కడ కూడా అటెండెన్స్ రిజిస్ట్రార్లో 36 మంది చిన్నారులు ఉంటే 21 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ఎంతో కౄషి చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ కేంద్రాలు నిర్వీర్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఈమె తోపాటు ఉపాధ్యక్షురాలు రూపావతి, బిజెపి కార్యదర్శి గంగు శ్రీదేవి తదితరులు పరిశీలించారు.