కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతంలో ఒక కిలోమీటర్ రేడియస్ వరకు ఇంటింటి సర్వే చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చినందున కాప్రా లోని సాయి బాబా నగర్, మౌలాలి లోని హెచ్ బి కాలనీ, రామంతపూర్ లోని చర్చి కాలనీలను కంటైన్ మెంట్ జోన్ లు గా ప్రకటించారు.
శనివారంనాడు కంటైన్ మెంట్ జోన్ లలో కలెక్టర్ పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బారికేడ్లను ఏర్పాటు చేసి దార్లను దిగ్బంధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వైద్య, మున్సిపల్, పోలీసు, రెవెన్యూ సమన్వయంతో కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులకు ప్రజలు బయటికి రాకుండా ఉండాలని సూచించారు.
కలెక్టర్ ఆశా వర్కర్లకు పార్లేజి బిస్కెట్ ప్యాకెట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, ఆర్ డి ఓ రవి, డిఎం అండ్ హెచ్ఓ వీరాంజనేయులు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ నారాయణ, కాప్రా తహసీల్దార్ గౌతమ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.