సోమశిల సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి సాధించిన సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి కి ఆ ప్రాంత ప్రజలు ఘన స్వాగతం పలికారు. సోమశిల గ్రామ ప్రజలు, టిఆర్ఎస్ శ్రేణులు గజమాల, శాలువాతో ఘనంగా ఆయనను సత్కరించారు.
సోమశిల గ్రామ ప్రజలు తమ ఆనందాన్ని ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డికి మిఠాయిలు తినిపిస్తూ పంచుకున్నారు. కృష్ణా నది తీరాన.. కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం.. సీఎం కేసిఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే సోమశిల సిద్దేశ్వరం వంతెన, జాతీయ రహదారి సాధన సాధ్యమైందని అన్నారు.
కొల్లాపూర్ ప్రాంత వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం తో పాటు జాతీయ రహదారిగా ఏర్పాటు చేయాలని గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రులు కేటీఆర్ కు, వేముల ప్రశాంత్ రెడ్డి కి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డికి, శ్రీనివాస్ గౌడ్ కు, పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
వారు సుముఖత వ్యక్తం చేసి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ద్వారా కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని వివరించారు. ఈ సోమశిల వంతెన నిర్మాణంతోనే కొల్లాపూర్ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, తాను ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారంగా ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి బ్రిడ్జి, జాతీయ రహదారి సాదించమన్నారు.
నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.