ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల దరికి చేరేలా అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం లోని పేరేపల్లి గ్రామంలో నిర్మించిన స్మశానవాటిక, కంపోస్టు షెడ్, డంపింగ్ యార్డ్, నర్సరీ మొక్కల పెంపకం తీరును శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ అన్ని గ్రామాలలో స్మశాన వాటికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలను పూర్తి చేసుకున్న డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్ లను ఉపయోగంలోకి తీసుకురావాలని అన్నారు.
నర్సరీ లో పెరుగుతున్న ప్రతి మొక్కను గ్రామంలో నాటేలా, వాటిని సంరక్షించేలా గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. స్మశాన వాటికలో ఉన్న పాడు బడిన వ్యవసాయ బావి చుట్టూ ప్రహరీ నిర్మించడానికి కలెక్టర్ నిధుల నుంచి విడుదల చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునితవెంకటేశం, జడ్పిటిసి సుంకరి ధనమ్మ యాదగిరి, సర్పంచ్ అంతటి వెంకటేశం గౌడ్, తహసిల్దార్ కృష్ణారెడ్డి, ఎంపిడిఓ లాజర్, ఏ ఈ శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.