నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే గ్రామగ్రామాన ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయడం జరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని కామారెడ్డి టౌన్, ఇసాయిపేట్, చుక్కాపూర్, జనగామ, దోమకొండ, పెద్దమల్లారెడ్డి, తలమడ్ల, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజల సమస్యలు తీర్చటం కోసమే ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా కాగితంపై రాసి పెట్టెలో వేస్తే వారంలోగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాను అందుబాటులో ఉన్నా లేకున్నా ప్రజలకు ఇబ్బందులు పడవద్దనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ప్రెస్ క్లబ్ భవనం కోసం పరిశీలన
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు కోసం సహకరించాలని ఎమ్మెల్యేను జర్నలిస్టులు కోరగా నేడు నిజాంసాగర్ చౌరస్తాలో గల డిప్యూటీ డీఈఓ భవనాల వద్ద గల పాత ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పరిశీలించారు. కొంతమంది జర్నలిస్టులతో కలిసి ప్రెస్ క్లబ్ భవనం వద్దకు చేరుకుని భవనం వద్ద వసతులపై ఆరాతీశారు. ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు కోసం కలెక్టర్ తో మాట్లాడతానన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శివ, రాజేష్, సురేష్, శ్రీకాంత్, స్వామి, వేణు, కిషన్, అన్వర్ ఉన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి