వైసీపీ కార్యకర్తలాగా పని చేస్తున్న సీఐడీ చీఫ్ సంజయ్ పై తెలుగుదేశం పార్టీ ఎంపీ కిజంరాజు రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. సీఐడీ చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అతిక్రమించి వైసీపీ తొత్తుగా పనిచేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ పక్షపాతాలు లేకుండా పనిచేయాల్సిన సీఐడీ చీఫ్ అన్ని నిబంధనలు ఉల్లంఘించారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై ఆయన రాజకీయ పరమైన బురద చల్లుతున్నారని ఎంపీ రామ్మోహన్ తెలిపారు.
విచారణ లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారని, సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారు ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం తీవ్రమైన నేరం. గోప్యంగా ఉంచాల్సిన దర్యాప్తు అంశాలు మీడియాకు విడుదల చేస్తున్నారు అని ఆయన తెలిపారు. తాను పంపిన ఫిర్యాదులో ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పై ఆధారాలను కూడా జత చేశారు. ఎంపీ రామ్మోహన్ ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.