వరుస ఓటమితో అసలే నైతిక బలం కోల్పోయి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రియాంకా గాంధీ వాద్రా ఆడిన చీప్ జిమ్మిక్కు మరింత చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రియాంకా గాంధీ వాద్రా వేసిన రాజకీయ ఎత్తుగడ సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొటున్నది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వలస కార్మికులను సొంత స్థలాలకు చేర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని, వారికి చేతకాకపోతే తాను వెయ్యి బస్సులు పెట్టి వారిని తరలిస్తానని ప్రియాంక గాంధీ వాద్రా ఆర్భాటంగా చెప్పారు.
సాధారణంగా ఇలాంటి సవాల్ విసిరితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదు. మీరు ఇచ్చేది ఏమిటి మేమే చేస్తాం అంటారు. అయితే ప్రియాంక గాంధీ కరోనా సమయంలో రాజకీయం ఆడుతున్నారని గ్రహించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆమె ఇచ్చిన ఆఫర్ ను ఆమోదించింది. ప్రియాంక గాంధీ ఇస్తానన్న బస్సులు లక్నోకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.
అయితే లక్నో వరకూ బస్సులను పంపాలని కోరడం మానవత్వం అనిపించుకోదని ప్రియాంకా గాంధీ కార్యదర్శి సమాధానమిచ్చారు. దాంతో 500 బస్సులను కౌసంబీకి, 500 బస్సులను షాహిబాబాద్ కు పంపాలని ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి మళ్లీ కోరారు. ఈ సారి తాము ఏర్పాటు చేసిన బస్సులు ఇవే అంటూ ఒక జాబితాను ప్రభుత్వానికి పంపారు.
ఆ జాబితాలో ఆటోలు, పనికిరాని టాక్సీలు ఉన్నాయి. వీటిపై అమేథీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అతిది సింగ్ తీవ్రంగా విమర్శించారు. ఈ సమయంలో ప్రియాంకా గాంధీ ఇలాంటి రాజకీయాలు చేయడం కరెక్టా అని ఆమె ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని, అయితే వాటిని తప్పుపడుతూ ప్రియాంక గాంధీ చేసింది ఏమిటని ఆమె ప్రశ్నించారు.