సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల సమావేశం గురువారం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వెలిదండ సరిత వీరారెడ్డి, తేజావత్ రాజా నాయక్, బొల్లెద్దు ధనమ్మ, కారింగుల విజయ వెంకటేశ్వర్లు, వేముల వరలక్ష్మీ నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చి మమ్మల్ని గెలిపించిందని, పార్టీ కన్న తల్లితో సమానమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లగొండ పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మా గెలుపు కోసం ఎంతో కృషి చేశారని, అటువంటి పార్టీ కోసం తమ ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తామని అన్నారు.
కొంతమంది పార్టీ గుర్తుపై (హస్తం) గెలిచి స్వార్థం కోసం పార్టీ కండువాలు మారుస్తూన్నారని, అటువంటి వారికి వారి వార్డులో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ లే అవుట్ల విషయంలో ఎటువంటి టెండర్లు లేకుండా కమీషన్ల కోసం నామినేషన్ పద్ధతిలో మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికార పార్టీ ఆగడాలను ఎండకట్టే వరకు తమ పోరాటం ఆగదని, పార్టీలు మారే వారు పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి అప్పుడు మరో పార్టీ కండువాలు మార్చుకోవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.