ఉత్తరాంధ్ర లో మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో గడచిన రెండు రోజుల నుంచీ వర్షాలు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా 26వ తేదీన ఉదయం నుంచీ రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతునే ఉంది. దీంతో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ,కలెక్టర్ నాగలక్ష్మి అప్రమత్తం అయ్యారు. దీంతో భారీవర్షాలపై అప్రమత్తం అయి.. పర్యవేక్షణకు కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 08922236947 నెంబర్ ఇచ్చారు. జిల్లాలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ ఈ సందర్భంగా “సత్యం న్యూస్. నెట్” కు చెప్పారు.
వర్షాల కారణంగా ఏదైనా ప్రమాదాలు సంభవించినా, అత్యవసర సహాయం అందించాల్సి వచ్చినా సహాయ చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. వర్షాల వల్ల ఎవరికైనా సహాయం అవసరమైతే కలెక్టర్ కార్యాలయం లోని కంట్రోల్ రూం నెంబరు 08922-236947 కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. వర్షాల కారణంగా చెరువులు గండిపడటం, రోడ్లు తెగిపోవడం వంటి ఘటనలపై సమాచారాన్ని కూడా కంట్రోల్ రూంకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్రూంలు తెరిచామని తెలిపారు.