స్థానిక ఎన్నికలు దృష్ట్యా…విజయనగరం జిల్లాలో సారా, మద్యం అక్రమ రవాణాను క్షేత్ర స్థాయిలో నియంత్రించేందుకు ప్రజల నుండి సమాచారాన్ని సేకరించేందుకు, సులువుగా దాడులు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ ఈ బి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు తెలిపారు.
రాష్ట్ర ఎస్ ఈ బి కమీషనరు వినీత్ బ్రిజ్ లాల్, ఆదేశాలతో మేరకు ప్రజల నుండి అక్రమ మద్యం, సారా సమాచారాన్ని సేకరించేందుకు, దాడులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసామన్నారు.
సారా, మద్యం అక్రమ రవాణా, తయారీ గురించి ఏదైనా సమాచారాన్ని 08922-274863 లేదా 9440902363కు ఫిర్యాదులు చేయవచ్చునని…. సమాచారాన్ని అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
నాటుసారా తయారీ కేంద్రాల పైన నిరంతరం దాడులు జరిగేలా జిల్లా వ్యాప్తంగా 13 ఎస్ ఈ బి స్టేషన్లు మరియు టాస్క్ ఫోర్స్ బృందాలను ఇప్పటికే అప్రమత్తం చేసామన్నారు.
అలాగే ఒడిస్సా ఎక్సైజ్ సిబ్బందితో కలిసి వ్యూహ రచన చేసి, దాడులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
అంతరాష్ట్ర చెక్ పోస్టులైన బొడ్డవర, చింతలదిమ్మ, వెంకం పేట గోలీలు మరియు మునిగూడ వద్ద ఆకస్మిక తనిఖీలు చేపడతా మన్నారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మకాలను ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షించే విధంగాను, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలను చేపట్టామన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగుకు 44 గంటల ముందు జిల్లాలో ఎటువంటి మద్యం అమ్మకాలు జరగకుండా అన్ని మద్యం దుకాణాలను, బార్లను మూసివేయాలని ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీ రావు తెలిపారు.