కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గినట్టు కనిపిస్తున్నా పూర్తిగా అంతరించిపోలేదని మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అందుకే కరోనాపై చేస్తున్న పోరులో ఎట్టి పరిస్థితుల్లోను అలసత్వం వహించవద్దని ప్రజలకు సూచించారు.
దేశంలో ఇప్పటివరకు 185 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రధాని తెలిపారు. అత్యంత వేగంగా సంక్రమిస్తున్న ఎక్స్ఈ వేరియంట్ గుజరాత్లో వెలుగు చూసిన నేపథ్యంలో ప్రధాని మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు. గుజరాత్ లోని జునాగడ్ జిల్లాలో వంథలిలో మాయుమియా ధామ్ ఆలయ 14వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన మహాపటోత్సవ్ కార్యక్రమంలో వర్చువల్ పద్ధతితో మోదీ మాట్లాడారు.
కడ్వాపటీదార్ సమాజానికి చెందిన దేవత యుమియా. మాయుమియా భక్తులు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లల సంరక్షణకు అలాగే ఎనీమియాతో బాధపడుతున్న తల్లుల ఆరోగ్య భద్రత కోసం గ్రామస్థాయిలో ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు.
ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్న మాయుమియా ట్రస్టు పిల్లల ఆరోగ్యం ప్రోత్సహించే విధంగా గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో మాతృభూమిని రసాయన ఎరువుల నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కడ్వాపటీదార్ రైతులకు ఉద్ఘాటించారు.
ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న అజాద్కీ అమృతోత్సవ్లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లు (చెరువులు) సృష్టించాలని సూచించారు. లక్షలాది చెక్డామ్లు కట్టే మీకు చెరువులు నిర్మించడం పెద్ద సాహసమేదీ కాదని ప్రజలను ఉద్దేశించి సూచించారు.