ఇంటి ఆవరణలో ప్రమాదవశాత్తూ కింద పడి తలకు దెబ్బ తగిలి ఆసుపత్రిలో చేరితే చివరకు అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అదీ కూడా ఆయన మరణించిన తర్వాత. 60 సంవత్సరాల ఈ వృద్ధుడికి కరోనా లక్షణాలు ఏవీ లేవు. మరణానంతరం కరోనా పాజిటీవ్ రావడంతో ఆయన తలకు తగిలిన దెబ్బకు చికిత్స అందచేసిన ప్రయివేటు ఆసుపత్రి సిబ్బంది ఇప్పుడు కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం, కొండారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మూడు రోజుల కిందట ఇంటిలో ప్రమాదవశాత్తూ కింద పడ్డాడు. అతన్ని వెంటనే కల్వకుర్తి లో, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ(అచ్చంపేట) ప్రజా వైద్యశాల హాస్పిటల్ కి తరలించారు.
అక్కడ చికిత్స పొందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ మాలక్ పేట యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నాడు. అక్కడి మెడికల్ సిబ్బంది కరోనా అనుమానిత శాంపిల్స్ తీసి నిమ్స్ హాస్పిటల్ పంపించగా నిన్న ఉదయం 9:00 గంటలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆయన కోమాలో ఉండి కోలుకోలేక ఈరోజు తెల్లవారు జామున చనిపోయాడు.