కోర్టు ధిక్కార నేరం కేసులో ఏపి హైకోర్టుకు నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ హాజరయ్యారు. ఆమెతో బాటు పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజ శంకర్ కూడా కోర్టు కు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు స్వీకరించిన విషయం తెలిసిందే.
సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం 623 జీవో ను జారీ చేయడాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఎందుకు పరిగణించ కూడదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర సిఎస్ ను హైకోర్టు ఆదేశించింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ని ప్రారంభించాలని ఇప్పటికే రిజిస్ట్రార్ ను హైకోర్టు ఆదేశించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం హైకోర్టు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులు హాజరయ్యారు.