కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం మున్సిపాలిటీ విలీన గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ డిమాండ్ చేసింది. లేకపోతే కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించింది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భూములు కోల్పోతున్న రైతులు 40 రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటితో మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల గడువు ముగియడంతో నేడు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విలీన గ్రామాల రైతులు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
రెండున్నర గంటల పాటు చర్చల అనంతరం కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 15 న సంక్రాంతి పండగ సందర్బంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లపై ముగ్గులు వేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 20 వ తేదీ లోపు విలీన గ్రామాలకు చెందిన టిఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
విలీన గ్రామాలకు సంబందించిన 1 వ వార్డు కౌన్సిలర్ గడ్డమిధి రాణీ(బీఆర్ఎస్), 2 వ వార్డు సుతారి రవి(బీజేపీ), 6వ వార్డు ఆకుల రూప(బీఆర్ఎస్), 9వ వార్డు పడిగే సుగుణ(బీఆర్ఎస్), 10 వ వార్డు ఉరుదొండ వనిత(బీఆర్ఎస్), 11 వ వార్డు కాసర్ల శ్రీనివాస్(బీజేపీ), 12 వ వార్డు కాసర్ల గోదావరి(బీఆర్ఎస్),13 వ వార్డు శంకర్ రావు(బీఆర్ఎస్), 35 వ వార్డు పోలీస్ క్రిష్ణాజీ రావు(బీఆర్ఎస్) లు రాజీనామా చేయాలన్నారు. తరవాత తామే మళ్ళీ గెలిపించుకుంటామన్నారు.
రాజీనామా చేసి రైతులకు అండగా నిలబడకపోతే కౌన్సిలర్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశానికి వచ్చిన బీజేపీ కౌన్సిలర్లు రైతులకు తాము అండగా ఉంటామన్నారు. రైతులకు నష్టం కలిగించే మాస్టర్ ప్లాన్ రద్దు కొరకు ఎప్పుడైనా తాము రాజీనామాకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు.