బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుష్ప్రచారాలపై తప్పనిసరి పోరాటం సాగించాలని సోనియాగాంధీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ అగ్రనేతలతో మంగళవారంనాడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సోనియాగాంధీ అధ్యక్షత వహించారు.
పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్చార్జులు, పీసీసీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు నిలబడి పోరాటం చేయాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని, ఎండగట్టాలని అన్నారు.
ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త సభ్యులే కీలకమైనే విషయాన్ని పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జులు గుర్తించాలని అన్నారు. దశాబ్దాల తరబడి పార్టీ ఇదే బాటలో నడుస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యకర్తలను గుర్తించి, ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ ‘అకృత్యాల’ బాధితుల తరఫున రెట్టించిన ఉత్సాహంతో పోరాటం సాగించాలని అన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగావకాశాల కోసం పోరాడుతున్న యువత, చిన్న, మధ్య తరగతి వ్యాపారులు, మన సోదర, సోదరీమణులు, ముఖ్యంగా అణగారిన వర్గాల సమస్యలపై దృష్టి సారించాలని నేతలకు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. న్యూ మెంబర్షిప్ డ్రైవ్, అందుకు అనుసరించాల్సిన విధివిధానాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. నవంబర్ 1న కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు.