జిల్లా కోర్టులో పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులతో ఏర్పాటుచేసిన 4 కోర్ట్ హాళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మొబైల్ కోర్ట్, ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్-కమ్-ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎక్సైజ్ కోర్ట్ హాళ్ల నిర్వహణకు భవన పునర్నిర్మాణం చేపట్టి, ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పనిని ప్రతి రోజు చేయాలని ఆయన అన్నారు. తాను వచ్చినప్పటి నుండి సత్తుపల్లి బార్ అసోసియేషన్, ఖమ్మం బార్ అసోసియేషన్ లకు కలెక్టర్ సహకారంతో ఏసీ లు పెట్టించినట్లు, ఇంకా భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో ప్రధమ స్థానంలో నిలిచామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, న్యాయవాదులకు, ప్రజలకు సౌలభ్యం కొరకు సమీకృత కోర్టు భవనాల సముదాయం నిర్మించినట్లు, ఇది చూసే పాలనా సౌలభ్యం కొరకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పౌరునికి న్యాయం అందించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పనిచేయాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి సామాజిక కోణంలో పనిచేస్తున్నారని, ప్రజల్లో న్యాయం లభిస్తుందనే నమ్మకం కల్గిస్తున్నారని, న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. కోర్టులో ఏసీ, ఫర్నిచర్ లకు ప్రతిపాదనలు పంపితే మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి డానిరూత్, ఎస్సి, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి అమరావతి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జావిద్ పాషా, న్యాయమూర్తులు శాంతిసోని, మౌనిక, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు, బార్ బాధ్యులు వీరేందర్, వీరన్న, యాకుబ్, వెంకట నారాయణ, ఇమ్మడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.