సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ అమరవరం గ్రామంలో గురువారం సిపిఐ శాఖా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు హాజరై మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, నోట్ల రద్దు, జిఎస్టి, పన్నులు వసూలు చేసి ప్రజలపై అదనపు భారం మోపిందని అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని,బిజేపి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం వల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని అన్నారు.పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు ప్రభావం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని,మత ఘర్షణలు పెంచి ప్రజల మద్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు లక్ష కోట్ల రూపాయల మిగులు డబ్బులతో ఏర్పడటం జరిగిందని, నేడు 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయటం వలన ఈ రాష్ట్ర ప్రజలపై పెను భారం పడిందని,డబల్ బెడ్ రూమ్ గృహాలు లేవు,రైతు ఋణ మాఫీ చేయలేదని,కొత్త పెన్షన్ మంజూరు లేదని,దళితులకు మూడు ఎకరాల భూమి ఊసే లేదని,కరెంటు బిల్లులు పెంచారని,లిక్కర్ ధరలు విపరీతంగా పెంచారని,ఈ ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కందుల వెంకటేశ్వర్లు,పగడపాటి సైదిరెడ్డి,గుంజ వెంకన్న,గుంజ ఉపేందర్,మదుల కిష్టయ్య, కొండారెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్