టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. జనగామ లో నేడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ కరపత్రం నేడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక వరి ధాన్యాన్ని కొనే నాధుడు లేక అకాల వర్షానికి కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతుంటే పాలకులు ప్రగతి భవన్ లో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన అన్నారు. రైతులకు సరైనా న్యాయం జరగాలంటే కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కొమ్మూరి అన్నారు.
ఆనాడు స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు కు ఏకకాలంలో రుణ మాఫీ, ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకున్నది వాస్తవం కాదా అని అడుగుతున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దలు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ వ్యవసాయ రంగాన్ని నీరు కారుస్తున్నారని ఆయన తెలిపారు.
తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి రాహుల్ గాంధీ వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించి రైతుల వెన్నుదట్టి రైతాంగానికి భరోసా కల్పించారని కొమ్మూరి తెలిపారు. అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని సరైన మద్దతు ధరతో ఎలాంటి తరుగు లేకుండా ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ ను గ్రామ గ్రామానికి తీసుకువెళ్లి రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ ఛైర్మన్ జిల్లెల్ల సిద్దారెడ్డి, మాజీ సర్పంచ్ నాగంపల్లి శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి, జిల్లా మైనార్టీ నాయకులు మహమ్మద్ అర్షద్, ఖాజా, గంధమల్ల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.