కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంచడం పట్ల తమ నిరసనను వ్యక్తం చేస్తూ భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో శుక్రవారం రహదారిపై వంట గ్యాస్ సిలిండర్లతో వంటి, వార్పు తో నిరసన,ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతుందని,అనునిత్యం పెట్రోల్,డీజిల్ ధరలను పెంచటం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు.పేద ప్రజలకు పని దొరకక,దొరికిన పనికి సరైన కూలి లభించక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని, పిల్లల చదువులకు,వారి బట్టలకు అమితమైన ఫీజులు పెంచారని, పెరిగిన రేట్లకు పేద కుటుంబాలు ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.
కోవిడ్ కారణంగా అనారోగ్యాల పాలైన కుటుంబాలలో పూట గడవటమే కష్టమైన పరిస్థితి ఏర్పడిందని,ప్రభుత్వాలు ప్రజలపై భారం రోజురోజుకీ మోపుతుంటే పేద, మధ్యతరగతి కుటుంబాల బ్రతుకులు భారమై పోతున్నాయని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య కార్యదర్శి భీమ్ పద్మ, కమిటీ సభ్యులు నాగమ్మ, నరసమ్మ, కోటమ్మ, చింత్రియాల దానమ్మ, నిర్మల, నందిగామ నాగమ్మ, చిత్తలూరి లక్ష్మమ్మ, వడ్డెర కోటమ్మ, అచ్చమ్మ, ఉసిరికాయ లచ్చమ్మ, మైసమ్మ, చింత్రియాల జయమ్మ, కొత్తగూడెం కోటమ్మ, సిపిఐ మండల కార్యదర్శి రవి, తదితరులు పాల్గొన్నారు.