సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి గురుదాస్ దాస్ గుప్తా మరణించారు. 83 సంవత్సరాల గురుదాస్ దాస్ గుప్తాకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కోల్ కతా లోని తన నివాసంలో తెల్లవారు జామున 6 గంటలకు ఆయన మరణించారు. క్యాన్సర్ సోకిన నాటి నుంచి ఆయన పార్టీ పోస్టులను వదిలేశారు. అయితే జాతీయ కార్యదర్శివర్గ మండలిలో మాత్రం సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఏఐటియుసి కార్మిక నాయకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి గురుదాస్ దాస్ గుప్తా. ఆయన అనర్గళంగా చేసే ప్రసంగాలు ఉత్తేజపూర్వకంగా, ఆలోచనలు రేకెత్తించేవిగా ఉంటాయి. దాస్ గుప్తా మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజా హక్కుల సాధన కోసం పీడిత ప్రజల పక్షాన ఆయన చేసిన పోరాటాలను ముఖ్యమంత్రి కొనియాడారు. తాను ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో గురుదాస్ దాస్ గుప్తాతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
previous post
next post