ఉత్తర సరిహద్దుల్లో ఉన్న అత్యవసర పరిస్థితి దృష్ట్యా అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసేందుకు, ఉన్న వాటిని మరమ్మత్తులు చేసుకునేందుకు సాయుధ దళాలకు అధికారం ఇస్తూ బుధవారంనాడు న్యూఢిల్లీలో జరిగిన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది.
ఈ నిర్ణయం మేరకు సాయుధ దళాలు రూ.300 కోట్ల వరకూ ఖర్చు చేసుకోవచ్చు. దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిఏసీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం మేరకు కావాల్సిన ఆయుధాలను కొనుగోలు చేసే ప్రక్రియను తగ్గిస్తారు.
అందువల్ల ఎలాంటి జాప్యం లేకుండా ఆయుధాలను సమకూర్చుకునే వీలుకలుగుతుంది. ఆరు నెలల్లో కావాల్సిన ఆయుధాలకు ఆర్డర్ ఇచ్చి ఏడాదిలో వాటిని తెచ్చుకునే విధంగా అనుమతులు ఇచ్చారు. అంతే కాకుండా భారత వాయు సేన తన బలాన్ని మరింత పెంపొందించుకోవడానికి కూడా అనుమతులు మంజూరు చేశారు.
21 కొత్త మిగ్ 29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు, ఇప్పటికే ఉన్న 59 మిగ్ 29 యుద్ధ విమానాలను ఆధునీకరించేందుకు డిఏసీ అనుమతించింది. అదే విధంగా 12 సుఖోయ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు కూడా అనుమతించారు.