దళిత బంధు పథకాన్ని గ్రామానికి ఒకే ఒక వ్యక్తికి ఇచ్చి, మిగతా మాల మాదిగ సోదరులను విస్మరించడంతో గ్రామాల్లో తగాదాలు వస్తున్నాయని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డి కె మాదిగ అన్నారు. మరీ ముఖ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో టిఆర్ఎస్ పార్టీలో పనిచేసే వ్యక్తికి దళిత బంధు ఇస్తున్నారని ఆయన అన్నారు.
కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి. ఒక మండలానికి దాదాపుగా 18 నుంచి 20 గ్రామాలు ఉంటాయి. గ్రామానికి ఒక వ్యక్తికి దళిత బంధు వర్తింప చేస్తే మిగతా దళితుల సంగతేంటి? అని ఆయన ప్రశ్నించారు. దళిత బంధు ఇస్తే అందరికి ఇవ్వండి. లేకపోతే లేదు. కానీ దళితుల మధ్య విభేదాలు తీసుకొస్తూ కొట్లాట పెట్టకండి అని ఆయన సలహా ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేతకాకపోతే దళిత బంధు పథకాన్ని రద్దు చేయండి. అంతేగాని గ్రామానికి ఒకరికి ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సమంజసం కాదని డికే.మాదిగ అన్నారు.