దళిత బంధు పథకాన్ని హుజూర్ నగర్ కి పరిమితం చేయొద్దని దళిత బంధు పథకాన్ని యావత్ తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని, దళిత గిరిజన పేదలైన బీసీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లె పువ్వుల శ్రీకాంత్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండ కింద ప్రసాద్ గౌడ్ ల ఆధ్వర్యంలో చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సత్యాగ్రహ దీక్ష నేడు ముగిసింది.
టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర జంగయ్య యాదవ్ దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలియజేసి నిమ్మరసం అందించి దీక్షను విరమింపచేశారు. అనంతరం ప్రదర్శనగా స్థానిక రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందచేశారు. ఈ దీక్ష ప్రారంభానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అత్యాచారానికి గురైన పసి బిడ్డ చిన్నారి చైత్ర చిత్రపటానికి శ్రద్ధాంజలిని అర్పించారు.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఎమ్మార్పీఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సదానందం, రావల్ కోల్ నరసింహ గౌడ్, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి పి సి సి సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ జిల్లా కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర జంగయ్య యాదవులు మాట్లాడుతూ కేవలం హుజూర్ నగర్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దళిత బంధు అమలు చేయడం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు.