కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంఎల్సి తాతా మధు కొనియాడారు. జగ్జీవన్రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం తెలంగాణతల్లి సర్కిల్ లో గల జగ్జీవన్ రాం విగ్రహానికి, గట్టయ్య సెంటర్ లోని తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేత అని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని మనమంతా స్మరించుకొని ఘనంగా నివాళులు అర్పించాలన్నారు.
డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. తద్వారా సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ బాటలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని పాటుపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ V.P. గౌతమ్ , పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ , జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ , పునుకొల్లు నీరజ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , విజయ్ కుమార్ , వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్ లు, దళిత సంఘాల నాయకులు ఉన్నారు.