ఇక నుంచి పరిపాలన బాధ్యతలు అన్ని కూడా విశాఖలోనే నిర్వహిస్తామని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఈ మేరకు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశ పెట్టారు. దీంతో పాటు సీఆర్డీఏను రద్దు చేస్తూ కూడా సభలో బిల్లు ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో ప్రత్యేకమైన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని మంత్రి తెలిపారు.
అభివృద్ధి అనేది వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. చట్టసభలకు రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని మంత్రి తెలిపారు. విశాఖలోనే రాజ్ భవన్, సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు. పరిపాలన బాధ్యతలు అన్ని కూడా విశాఖలోనే నిర్వహిస్తామన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను నిర్ణయించామన్నారు. ఇక జ్యుడీషియల్ బాధ్యతలు అన్ని కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ ఏరియా ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామన్నారు.
కర్నూలులో న్యాయపరమైన అన్నిశాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రాంతీయ అసమానతలు, సమాన అభివృద్ధి లేకపోవడం వల్లే రాష్ట్రంలో అశాంతికి దారితీస్తున్నాయన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి భద్రత మాత్రమేనని మంత్రి అన్నారు.