ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మూడు రాజధానుల విభజన మంటల్లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో భావోద్వేగాలు చెలరేగుతున్నాయని, ఇది రాష్ట్ర సమైక్యతకు భంగం కలిగిస్తుందని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య హెచ్చరించారు. గురువారం బహుజన జెఎసి ఉపాధ్యక్షులు మామిడి సత్యం అధ్యక్షతన విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కంచే చేను వేసిందన్న సామెతగా అరసవల్లి రాజధాని రైతుల పాదయాత్రను పురస్కరించుకొని ఈనెల 15వ తేదీన వీకేంద్రీకరణ పేరుతో ప్రభుత్వ స్పాన్సర్డ్ గర్జన ర్యాలీలు జరగటం రాష్ట్రానికి క్షేమమా? అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి చెందిన ఉత్తరాంధ్ర మంత్రులు ఒక ప్రాంత మంత్రుల్లా మాట్లాడుతున్నారని, ఇప్పటికీ ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు భావాలు ఉనికిలోనే ఉన్నాయని, వీటికితోడు మధ్యాంధ్ర రాష్ట్ర భావాలు కూడా తోడైతే, రాష్ట్రం మూడు రాష్ట్రాలు కాదా? అని అన్నారు. రాజధాని విభజన అసాధ్యమైన పని అని, అందుకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం, సిఆర్ డిఎ చట్టాలు, న్యాయస్థానం తీర్పు రాజధానికి రక్షణ గా ఉన్నాయన్నారు. మూడు రాష్ట్రాల విభజన సాధ్యమైన పనే అని, ముఖ్యమంత్రి చేతుల్లో ఉందని తెలిపారు. ఒకే ఒక్క అసెంబ్లీ తీర్మానం చేసి,దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపితే, ఆర్టికల్ 3 ద్వారా మూడు రాష్ట్రాలుగా రాష్ట్రాన్ని విభజించవచ్చని సూచించారు.
ప్రతిపక్ష పార్టీలు కూడా అసెంబ్లీలో అడ్డుపడవని చెప్పారు. మూడేళ్లుగా రాజధాని పిల్లల మధ్య చాక్లెట్ పంచాయతిగా మార్చారని అంటూ మూడు రాజధానుల నిర్మాణానికి లక్షల కోట్లు కావాలని,కానీ మూడు రాష్ట్రాల ఏర్పాటుకు కాగితాల ఖర్చు సరిపోతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయని, ఒకటి.ప్రజా రాజధాని అమరావతితో రాష్ట్రం సమైక్యంగా ఉంచటం, రెండు. రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా చేసి, మూడు సంపూర్ణ రాజధానుల నిర్మాణానికి తోడ్పడటం మాత్రమే మిగిలి ఉందన్నారు.
అరసవల్లి సూర్యభగవానుడులో ప్రాంతీయ భావాలు ముఖ్యమంత్రి కి కనిపించాయని, విజయవాడ కనకదుర్గం మోములో మధ్యంద్ర భావాలు, తిరుపతి వెంకన్న మోములో రాయలసీమ భావాలు కనిపించ లేదా? అని ప్రశ్నించారు. రాజధాని విభజిస్తే, దళిత బహుజన కులాలే నష్టపోతాయని చెప్పారు. రాష్ట్రాల విభజన అనైతికం కాదని,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు, మేధావులు, ప్రజలు మూడు రాష్ట్రాల ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలని బాలకోటయ్య కోరారు. మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ అరసవల్లి పాదయాత్ర పై ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం భావ్యం కాదన్నారు. మంత్రులే విభజనకు నాంది పలుకుతున్నారని, ఇలాంటి భావాలు భవిష్యత్తులో రాష్ట్ర సమైక్యతకు గొడ్డలి వేటు అవుతాయని హెచ్చరించారు.
రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ మూడు రాజధానుల మంటల్లో రాష్ట్రం తగలబడి పోతుందని, అందులో వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు చలికాగుతున్నారని చెప్పారు. పాదయాత్ర పై డ్వాక్రా మహిళలని తీసుకువచ్చి, ప్లే కార్డ్స్ పట్టుకొని, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టడం హేయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల నాయకులు పాల్గొన్నారు.