తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారువాకిలి చెంత నిర్వహించారు.
శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పార మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలు అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు.
నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు మరియు దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తిఅయినది.అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు.
ఈ ఆస్థానంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బా రెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మా రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, డా.నిశ్చిత, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.