దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జే ఎఫ్ ) కమిటీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు జ్యానేశ్వర్ చారి,ప్రధాన కార్యదర్శి పెద్దిగారి స్వామి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అశోక్ కుమార్ లు అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర టీడబ్ల్యూజేఫ్ నాయకుల పిలుపు మేరకు వనపర్తిలో సోమవారం అక్టోబర్ 10 ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 35 ఏండ్లుగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని,జర్నలిస్టుల సమస్యలను మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘డిమాండ్స్ డే’ను చేపట్టినట్టు వివరించారు.
డిమాండ్స్ డే రోజున ఇండ్లస్థలాలు, ఆర్టీసీ బస్సు పాసులు, టోల్ గేట్ సమస్యలు, జర్నలిస్టు బంధు, రైల్వేపాసులపై కలెక్టర్ కు వినతిపత్రo ఇచ్చామన్నారు.కలెక్టర్ కార్యాలయ ముందు శాంతియుత ప్రదర్శనలు బ్యానర్లు, ప్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని డిమాండ్స్ డేను నిర్వహించామన్నారు. అలాగే జర్నలిస్టులకు ప్రస్తుతం ఆర్టీసీ ఇస్తున్న 75 శాతం రాయితీ సరిగ్గా అమలుకావడం లేదని, డీజిల్ సెస్, టోల్ గేట్ల ఫీజులతో రాయితీ కేవలం 50 శాతం మాత్రమే అమలవుతున్నదని తెలిపారు. .
జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లు పునరుద్ధరించాలని ,బస్ పాస్, రైల్వే పాస్ లపై 100 శాతం రాయితీ కల్పించాలని, ఆర్టీసీ బస్ రాయితీ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, మహిళా జర్నలిస్టుల రాత్రి పూట రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.
జర్నలిస్టులకు ”జర్నలిస్టుబంధు” పథకం ప్రవేశ పెట్టాలి.అనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాక్షులు రాఘవేందర్ గౌడ్, శ్రీనివాసలు, శ్రీనివాసచారి, గోపి, రామకృష్ణ, కుమారస్వామి, నాగరాజు, నాయుడు, రామకృష్ణ, రవికుమార్, శంకరయ్య పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్