ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, ఒడిశా మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
అలాగే పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో పాటూ కోస్తా, రాయలసీమలపై నైరుతి రుతుపవనాల ప్రభావం చురుగ్గా కొనసాగుతోందని వాతావరణశాఖ చెబుతోంది.
ఉత్తర కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.