ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవాన్ని వచ్చే నెల 1ని నిర్వహించేందుకు పైడితల్లి ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ ఈఓ సుధారాణి ఈ విషయం తెలియజేసారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం మే 1వ తేదీన నిర్వహించి ఆ రోజున అమ్మవారిని వనం గుడి నుండి చదురుగుడికి తీసుకు వచ్చే కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె.ఎల్.సుధారాణి వెల్లడించారు.
ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు, ట్రస్టు బోర్డు సభ్యులతో కలిసి అమ్మవారి కళ్యాణ మంటపంలో ఉత్సవ విశేషాలను తెలిపారు. మే 1వ తేదీన సాయంత్రం 4-00 గంటలకు ఆలయ సంప్రదాయాల ప్రకారం వనం గుడి నుండి అమ్మవారు బయలుదేరి హుకుంపేటలో గల ఆలయ పూజారి ఇంటికి చేరుకుంటారని, రాత్రి 10 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 2వ తేదీ ఉదయం 6-30 గంటలకు మూడు లాంతర్లు వద్ద నున్న చదురు గుడికి చేరుకుంటారని తెలిపారు. దేవర ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ట్రస్టు బోర్డు సభ్యులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ ఉత్సవంలో భక్తులంతా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి సంబందించి ఆలయ తలయారీ ద్వారా ఈ నెల 24న చాటింపు వేయిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ట్రస్టు బోర్డు సభ్యులు పతివాడ వెంకట రావు, ఎం.కే.బి.శ్రీనివాస రావు, బలివాడ పార్వతి, గంధం లావణ్య, ఎస్.అచ్చి రెడ్డి, చిల్లా పుష్ప తదితరులు పాల్గొన్నారు.