ద్వారకాతిరుమల దేవస్థానం పవిత్ర పుష్కరిణిలో పారిశుద్ధ్య కార్మికులు బెడ్ షీట్లు ఉతుకుతున్నారు. పుష్కరిణిని శుభ్రం చేయాలని ఆ ప్రాంతవాసులు గతంలో ఎన్నిసార్లు దేవస్థానం అధికారులకు చెప్పినా, అందులో బట్టలు ఉతక కూడదని, గేదెలు దిగకుండా చూడాలని స్థానికులకు సలహాలు ఇచ్చేవారట.
మరి ఇప్పుడు దేవస్థానం సత్రాల్లోని బెడ్ షీట్లను పుష్కరణిలో ఎలా ఉతుకుతున్నారని ప్రశ్నిస్తున్న స్థానికులు. దేవస్థానం అధికారుల తీరు చూస్తే నీతులు చెప్పడానికే గాని..
ఆచరించడానికి కాదు అన్నట్లుగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. అసలు స్వీపర్లతో (120 గదుల సత్రం లోని) బెడ్ షీట్లను ఎలా ఉతికిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. పుష్కరిలో దిగిన వారికి జరగరానిది ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? పుష్కరిణిలోని నీరు చూస్తే మురుగు, చెత్తాచెదారంతో దుర్వాసన వెదజల్లుతోంది.
అటువంటి నీటిలో భక్తులకు వినియోగించే తెల్లని బెడ్ షీట్లను ఎలా ఉతుకుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. వాషింగ్ మిషన్ పాడైందని, అందుకే ఇక్కడ ఉతికిస్తున్నామని శానిటేషన్ సూపర్వైజర్ చెబుతున్నాడని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉంటే చెప్పిన పని ఏదైనా చేయవలసిందేనని, లేకుంటే విధుల నుంచి తొలగిస్తామని పారిశుధ్య కార్మికులను కొందరు బెదిరిస్తున్నట్టు సమాచారం.