ప్రభుత్వం అమలు చేసే వివిధ అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలలో అవగాహన పెంచాలని జాతీయ గ్రామీణాభివృద్ది- పంచాయితీ రాజ్ సంస్ధ ( NIRD-PR) డైరెక్టర్ జనరల్ డా.జి.నరేంద్ర కుమార్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో క్షేత్ర స్ధాయి విలేకరుల కోసం పత్రికా సమాచార కార్యాలయం ఏర్పాటు చేసిన వార్తాలాప్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల పరిధిలో పలు కార్యక్రమాలు, సామాజిక పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం జల శక్తి మిషన్ పై 3.5 లక్షల కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తూ ఇంటింటికీ త్రాగునీరు సరఫరా చేస్తోందని, అలాగే గ్రామీణ ప్రాంతాలలో పట్టణ సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల మెరుగుదల, సామాజిక రంగాలలో సంస్ధాగతం గా చోటు చేసుకుంటున్న మార్పుల గురించి ప్రజలకు అవగాహాన కల్పించటంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
పిఐబి దక్షిణాది ప్రాంత డైరెక్టర్ జనరల్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ అభివృధ్ది జర్నలిజంలో పత్రికా సమాచార కార్యాలయం పాత్రను వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న కార్యక్రమాలను ఆయన సవివరంగా పాత్రికేయ మిత్రులకు వివరించారు. కేవలం సంచలన వార్తలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా వార్తలు రాయాలని కోరారు.
అంతకుముందు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్రీచ్ బ్యూరో (ఆర్ఓబీ), స్వాతంత్ర అమృత మహోత్సవం, కోవిడ్ జాగ్రత్తలు, వ్యాక్సినేసన్ లపై నేడు డిజిటల్ మొబైల్ వ్యాన్ ల ద్వారా ప్రచార కార్యక్రమాన్ని NIRDPR, రాజేంద్రనగర్ ప్రాంగణంలో డైరెక్టర్ జనరల్ డా. నరేంద్ర కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
మొబైల్ డిజిటల్ ప్రచార వాహనాల ద్వారా వారం రోజుల పాటు అనగా మార్చి 11, 2022 నుండి మార్చి 17, 2022 వరకు నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి ఇంకా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో… జన సమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా – రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్లు, వ్యాపార కూడళ్ళు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ప్రజలకు స్వాతంత్ర అమృత మహోత్సవం, కోవిడ్ జాగ్రత్తలు, వ్యాక్సినేసన్ ల గురించి అవగాహన కల్పిస్తాయి. ఈ వ్యానులు రాష్ట్రంలో పలు ప్రాంతాలలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఘట్టలను, దేశం సాధించిన విజయాలను ప్రచారం చేస్తాయి.
కేవలం రిపోర్టింగ్ వరకే కాకుండా రిపోర్ట్ చేసిన సమస్య పరిష్కారం అయ్యే వరకు పాత్రికేయులు పోరాడాలని ఈ కార్యక్రమానికి వక్త గా హాజరైన సీనియర్ పాత్రికేయులు హరపాల్ సింగ్ కోరారు. ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యాలయ, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ డా. ఎస్.జి రవీంద్ర, పత్రికా సమాచార కార్యాలయ, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో డైరెక్టర్ శృతి పాటిల్, పత్రికా సమాచార కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ డా. మానస్ కృష్ణకాంత్, సుధాకర్ రెడ్డి ఉడుముల, ఇన్వెస్టిగేటివ్ ఎడిటర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంకా పలువురు NIRDPR, PIB, ROB ఉన్నతాధికారులు పాల్గొన్నారు.