అభివృద్ధి పనులు చేయడంలో రాజీపడే ప్రసక్తే లేదని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండల కేంద్రంలో సోమవారం మిషన్ భగీరధ రాష్ట్ర స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న సైదిరెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరధ పనులలో హుజూర్ నగర్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలలో దగ్గరుండి అధికారులతో అభివృద్ధి పనులు చేయించాలని సూచించారు.
కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు రోడ్లను త్రవ్వితే సహించేది లేదని, ఫైబర్ వేసే పనులు పూర్తయిన తర్వాత రోడ్ల మరమ్మత్తులు చేయాలని సూచించారు. ప్రజలు నాణ్యతా ప్రమాణాలు లేని నీళ్ళను కొనుక్కొని త్రాగడం వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. మిషన్ భగీరధ నీళ్ళు నిపుణుల పర్యవేక్షణలో అన్ని గ్రామాలలో సరఫరా చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు.
అనంతరం చిల్లేపల్లి, బోడలదిన్న గ్రామాలలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
మిషన్ భగీరధ చీఫ్ ఇంజినీర్ కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మిషన్ భగీరధ పనులు కరోనా లాక్ డౌన్ సమయంలో కొద్దిగా ఆలస్యం అవడం వాస్తవమేనని, ఇప్పటి నుండి స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయంతో పనులు వేగవంతంగా పూర్తి చేసి అత్యంత త్వరలో నియోజకవర్గం మొత్తం గ్రామాలలో ప్రతి ఇంటిలో ఒక్కరికీ 100 లీటర్ల నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరధ సిఈ విజయప్రకాశ్, ఎస్ ఈ సురేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాపారావు, వెంకటేశ్వర్లు, DEE లు , నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.