వికారాబాద్ జిల్లా తాండూరు రూపురేఖలు మార్చి అభివృద్ధి చెందిన తాండూర్ గా మారుస్తానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, తాండూర్ అభివృద్ధిపై వివరాలను వెల్లడించారు. సుమారు పది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న తాండూర్ – జహీరాబాద్ , తాండూర్ – జిన్ గుర్తి-తట్టెపల్లి రోడ్డు, బైపాస్ రోడ్డు పనులను శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
మరొకవైపు మహబూబ్ నగర్- చించోలి రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నాపరాయి ఇండస్ట్రీ , ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రాబోతుందని తెలిపారు. శివసాగర్ ప్రాజెక్టు టెండర్ పూర్తి అయిందని, నీరు తగ్గుముఖం కాగానే పనులు ప్రారంభిస్తామని అన్నారు. జుంటిపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీని పెంచేలా చర్యలు చేపడతామని అన్నారు.
తాండూరులో విద్య కోసం ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తామని, యువత కోసం తాండూర్ సిమెంట్ పరిశ్రమల్లో లోకల్ వారికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పల్లెబాట కార్యక్రమం శ్రీ రామలింగేశ్వర దేవాలయం నుంచి ప్రారంభించనున్నట్లు వివరించారు.
తాండూరు మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో మూడు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అంతరాం వద్ద ఇండోర్ స్టేడియం, ఆడిటోరియం, ఎన్టీఆర్, రాజీవ్ , ఇందిరమ్మ కాలనీలలో బిటి రోడ్లు, వీధి లైట్లు, తదితర మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, అన్ని రంగాల్లో తాండూర్ రూపురేఖలు మార్చి, అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మీడియా సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు మురళీ గౌడ్, నర్సింలు, శ్రీనివాస్ చారి, ఆఫు,జావేద్, ఇంతియాజ్ బాబా ఉన్నారు.