నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తన తల్లి గారికి అనారోగ్యం అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. శనివారం ఉదయం కలెక్టర్ తల్లి గారైన గంగమ్మ కు బి.పి ఎక్కువై అనారోగ్యానికి గురి అయితే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను చూపించగా డా. శ్రీవాణి వైద్యం అందించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యులు, మెరుగైన వైద్యం అందుతుందనే భరోసాను ప్రజలకు కల్పించారు. సామాన్య ప్రజలు సైతం వైద్యం కొరకు ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని పేదరికం బారిన పడిపోతున్నారు. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నేడు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టడం జరుగుతుంది.
నాగర్ కర్నూల్ జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 330 పడకల స్థాయి పెంచుతూ అదనపు గదులు, వైద్య సామాగ్రి, ఐ.సి.యూ బెడ్లు, ఆక్సిజన్, డయాజ్ఞస్టిక్, వైద్య ప్రొఫెసర్లు నియామకమై ఆసుపత్రి రూపురేఖలు ఇప్పటికే మారిపోతుంది.
రాబోయే రోజుల్లో ప్రయివేటు ఆసుపత్రికి దీటుగా అన్ని వసతులు, స్పెషలిస్ట్ డాక్టర్లు, సర్జన్లు, నర్సింగ్ సిబ్బందితో జిల్లా ఆసుపత్రి రూపుదిద్దుకోబోతుంది. ఆసుపత్రి స్థాయి పెంపుకు జరుగుచున్న మరమ్మతులు, ఆసుపత్రి స్టోర్ రూమ్, మేల్, ఫీమేల్ వార్డులు తిరిగి కలెక్టర్ పరిశీలించారు.
వారం రోజుల్లో పని పూర్తి కావాలని, రోగుల వెంట వచ్చే అటెండెంట్ లకు కూర్చోడానికి హాల్, మంచి నీరు సౌకర్యం, మరుగుదొడ్లు వంటి అన్ని వసతులు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. నర్సులకు చేంజ్ రూమ్, లాకార్లు వంటి సౌకర్యం ఉండాలని సూచించారు.
ఆసుపత్రి పరిసర ప్రాంతం మొత్తం ఎక్కడ చెత్తా చెదారం లేకుండా సుందరికారణ జరగాలని అదే సమయంలో రోగులకు, వైద్య సిబ్బందికి అన్ని సౌకర్యాలు ఉండేవిధంగా ప్రణాళికలతో పనులు పూర్తి చేసి ఇవ్వాలని కాంట్రాక్టర్లను సూచించారు. డా. రమేష్ చంద్ర, డా. రోహిత్, డా. సుధాకర్, కాంట్రాక్టర్ బషీర్ అహ్మద్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూలు