నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కి తెలంగాణ మాదిగ దండోరా విజ్ఞప్తి
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టు ఆవుట రాజశేఖర్ కు ఇప్పటికైనా న్యాయం చేయాలని తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కి విజ్ఞప్తి చేసింది. గత సంవత్సరం 2021 జూన్ 2వ తేదీన, అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కొల్లాపూర్ ఎస్సై బాల వెంకటరమణ యాదవ్ జర్నలిస్టు ఆవుట రాజశేఖర్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి, బట్టలు విప్పించి విచక్షణ రహితంగా కొట్టారని తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డికే.మాదిగ తెలిపారు.
ఉదయం పోలీసులు తీసుకు వెళ్లిన తన భర్త ఇంటికి ఇంకా తిరిగి రాలేదని, రాజశేఖర్ భార్య, ఆవుట చైతన్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులు కొడుతున్న దెబ్బలకి తట్టుకోలేక తన భర్త అరుస్తున్న అరుపులు విని పోలీసులను ప్రశ్నించారని తెలిపారు. అయితే బయటకు వచ్చిన ఎస్సై, ఆమెను కులం పేరుతో, దూషిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, ఆమెను గేటు బయటకు గెంటివేశారని ఆయన తెలిపారు.
ఈనెల ఏడవ తారీఖున, అవుట చైతన్య ఎస్సీ ఎస్టీ కమిషన్ మహిళా విభాగం దగ్గరికి వెళ్లి తన గోడు చెప్పుకున్నారని ఆయన అన్నారు. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ నాగర్ కర్నూల్ ఎస్ పికి నోటీసులు జారీ చేసిందని ఆయన అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ పి నిజాయితీగా తన ఆధీనంలోని పోలీసులు చేసిన తప్పును అంగీకరించాలని ఆయన కోరారు. దీనివల్ల పోలీసు వ్యవస్థ అంటే సామాన్యులకు ఎంతో గౌరవం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
కొల్లాపూర్ పోలీసులు ఒక దళిత జర్నలిస్టుపై చేసిన దాడిని పోలీసు ఉన్నతాధికారులు కూడా సపోర్టు చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలపైనే ప్రజలకు నమ్మకం పోతుందని ఆయన అన్నారు. ఉన్నోడికి ఒక న్యాయం…ఎస్సీలకు ఒక న్యాయం నడుస్తున్నదని, ఇందుకేనా రక్షక భటులు ఉన్నది అని ఆయన ప్రశ్నించారు. అవుట చైతన్య ను కులం పేరుతో దూషించిన ఎస్సై ని, వెంటనే సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డికే.మాదిగ సదరు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కి విజ్ఞప్తి చేశారు.