కొత్తగా 57 సంవత్సరాలు దాటిన అర్హులైన పేదవృద్దులందరికీ ఆసరా పింఛన్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ నరేష్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మీ సేవా కేంద్రాలను ఆయన సందర్శించారు. మీ సేవా కేంద్రాల ప్రతినిధులు, పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వృద్ధుల తో ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలోని సెర్ప్ సీఈఓ కొత్త వృధ్దాప్య పింఛన్లకు సంబంధించిన మార్గదర్శకాల ఉత్తర్వులను జారీ చేశారన్నారు.
దీనికి అనుగుణంగా అర్హులైన పేదలంతా మీ సేవా కేంద్రాల ద్వారా ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. బర్త్ సర్టిఫికేట్లు గాని విద్యార్హత సర్టిఫికెట్లు గాని లేదా ఓటర్ఐడీకార్డును వయస్సు నిర్ధారణ కోసం దరఖాస్తు వెంట తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్న నిబంధనను విధించారన్నారు.
కాగా దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి రుసం వసూలు చేయరాదని కూడా మీ సేవాకేంద్రాల నిర్వాహకులకు ఆయన ఆదేశించారు. ఆసరాపెన్షన్లకు అర్హులైన పేదలంతా మీసేవా కేంద్రాల్లో ఉచితంగానే దరఖాస్తులు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందనన్నారు.
మీ సేవా కేంద్రాల నిర్వహకులు దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దున్నారు. దరఖాస్తుదారులు చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వమే రీయంబర్స్మెంట్ రూపంలో చెల్లిస్తుందనన్నారు.
పేద వృద్దులందరికీ దరఖాస్తులకు సంబంధించి ఇబ్బందులకు గురి చేయకూడదని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మీసేవ నిర్వాహకులకు ఆయన స్పష్టం చేశారు. మీసేవ కేంద్రాల్లో ఆసరా పెన్షన్ దరఖాస్తులకు ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.