యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాస రావు అన్నారు. జిల్లా న్యాయసేవా సదన్ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ, జీవితాలను నాశనం చేసే మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా వుండాలని, వాటిని చట్ట వ్యతిరేకంగా పంపిణి చేసేవారు మానులోవాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను మానసిక ఒత్తిడికు గురిచేయోద్దని, పిల్లలలో వచ్చే మానసిక మార్పులను గమనించి, కాపాడుకోవాలని ఆయన సూచించారు. యువత మొదట రుచి చూద్దామని ప్రారంభించే ఈ అలవాటు తదనంతరం వ్యసనంగా మారిపోతుందన్నారు. డ్రగ్స్ తదితర పదార్థాలను అక్రమ రవాణా చేసే వ్యక్తులు చట్ట ప్రకారం కఠిన చర్యలకు గురి అవుతారని న్యాయమూర్తి హెచ్చరించారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్న వారిని చూసి, యువత గుణపాఠం నేర్చుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, ఒత్తిడిలో వున్నవారు మాదకద్రవ్యాలకు బానిసలయ్యే అవకాశం వుంటుంది కాబట్టి, వారిని ప్రత్యామ్నాయ పద్ధతులకు మళ్ళించే ప్రయత్నం చేయాలన్నారు. ఈ బాధ్యత బంధువులు, స్నేహితులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, న్యాయమూర్తులు ఎన్. సంతోష్ కుమార్, ఎన్. అమరావతి, ఎన్. శాంతిసోని, ఎన్. వెంకట హైమ పూజిత, పి. మౌనిక, ఆర్. శాంతిలత, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి. రాజేందర్ రెడ్డి, ఏసిపి వెంకటస్వామి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. మాలతి, న్యాయవాద సంఘం అధ్యక్షుడు జి. రామారావు, న్యాయ సేవా సంస్థ న్యాయ సహాయ న్యాయవాది ఇమ్మడి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.