సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీలో గర్భగుడిలోకి వచ్చే భక్తులకు డ్రెస్కోడ్ అమలు చేయాలని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయించింది. జ్యోతిర్లింగాల్న తాకాలంటే ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని ఆలయ పాలనా విభాగం తెలిపింది. కాశీ విద్వత్ పరిషత్తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా విభాగం భక్తులు తప్పనిసరిగా ధోతీ-కుర్తా, చీర లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేననే నూతన నిబంధనలు తీసుకొచ్చింది.
ప్యాంట్, షర్ట్, జీన్స్, టీషర్ట్ లాంటి మోడ్రన్ దుస్తులు ధరించి వచ్చే భక్తులు ఇకపై దూరం నుంచి మాత్రమే విశ్వేశ్వరుడిని దర్శించుకునే వీలుంటుందని, వారిని గర్భగుడిలోకి అనుమతించబోమని ఆలయ అధికారులు వెల్లడించారు. జ్యోతిర్లింగం స్పర్శ దర్శనం చేసుకోవాలంటే పురుషులు తప్పనిసరిగా ధోతీ-కుర్తా, మహిళలు చీర ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ నూతన నిబంధనలను ఆలయ పాలనా విభాగం అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు యూపీ పర్యాటక మంత్రి డాక్టర్ నీలకంఠ్ తివారీ వెల్లడించారు. దీంతోపాటు అర్చకులను కూడా ఓ డ్రెస్కోడ్ తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.