శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పని చేస్తున్న కృష్ణ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో ఆయన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావు మాట్లాడుతూ, కృష్ణ వర్మ కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని, ఆ వ్యాధి తీవ్రత భరించలేక బహుశ ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెప్పారు.
ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన భార్య ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. కేసు దర్యాప్తు ప్రారంభించినట్టు సీఐ షణ్ముఖరావు తెలిపారు. వర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించామని అన్నారు. ఇటీవలే కృష్ణ వర్మ కు గుండె ఆపరేషన్ కూడా అయినట్టు సమాచారం.