వైకాపా పాలనలో రాష్ట్రం రేప్ ల ఆంధ్రప్రదేశ్ గా, నేరాంద్రప్రదేశ్ గా తయారయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి ఆరోపించారు. రేపల్లె రైల్వేస్టేషన్ లో భర్త కళ్లెదుటే ఒక మహిళ పై ముగ్గురు కామాంధులు ఆత్యాచారం చేయడం సభ్య సమాజానికి సిగ్గు చేటు అని, నిందితులు తాగిన మైకంలో ఉన్నట్టుంది తెలుస్తోందన్నారు.
నేరాలు జరిగిన అనేక సందర్భాలలో నేరస్థులు మద్యం సేవించడం గానీ, లేక గంజాయి తదితర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నట్లు తెలుస్తోందని, ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని. మత్తు పదార్థాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
వైకాపా ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా తయారయ్యిందని, బుధవారం పదోతరగతి తెలుగు ప్రశ్న పత్రం, గురువారం హింది ప్రశ్న పత్రం, శుక్రవారం ఇంగ్లీష్ ప్రశ్నపత్రం లీకయ్యిందని, గతంలో ఒక్క ప్రశ్నపత్రం లీకు అయినందుకే నాటి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ ముద్దు కృష్ణమనాయుడు మంత్రి పదవికి రాజీనామా చేశారని, నైతిక విలువలు వుంటే, ముఖ్య మంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.