బడ్జెట్ లో చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు సేకరించవచ్చా? …. ఇచ్చేవాడుంటే ఎలాగైనా సేకరించవచ్చు అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినకాడికి అధికార వడ్డీలు కూడా చెల్లించి మరీ ప్రయివేటు అప్పులు తీసుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలన్నీ రిజర్వు బ్యాంకులో ఉంటాయి. ఏ అప్పు తీసుకున్నా రిజర్వు బ్యాంకు ఖాతా నుంచి రావాల్సి ఉంటుంది.
అయితే రిజర్వు బ్యాంకు ఖాతాతో కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రుణాలు తీసుకున్నది. ఇలా ఇప్పటి వరకూ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇది తప్పూ రైటో చెప్పే వీలు లేదు.
కొందరు బడాబాబులు షెల్ కంపెనీలు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న విషయం మనం చూశాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాదాపుగా అలానే చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది.
నియమ నిబంధనలు కచ్చితంగా చూసి రిజర్వు బ్యాంకు ఎకౌంట్ లోనే డబ్బులు వేయాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా రుణాలు ఎలా ఇచ్చాయనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.
ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నుంచే రూ.15,000 వేల కోట్ల వరకు, అప్పుగా తీసుకోవటం జరిగింది. అలాగే తరువాత బ్యాంక్ అఫ్ బరోడా నుంచి రూ. 9వేల కోట్ల వరకు, బ్యాంక్ అఫ్ ఇండియా రూ. 7వేల కోట్లు, ఇలా దాదాపుగా 12 బ్యాంకుల నుంచి కూడా ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 56,076 కోట్లు అప్పు చేసింది.
ఈ రోజు రాజ్యసభలో టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో క్రమక్రమంగా కూరుకుపోతూ ఉంది అనే విషయాన్ని, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేయటం జరిగింది.
అయితే ఇందులో విశేషం ఏమిటి అంటే, ఇది బడ్జెట్ యేతర అప్పుగానే కేంద్రం చెప్పింది. అంటే ఇది అసలు బడ్జెట్ లో చెప్పిన విధంగా కాకుండా, బడ్జెట్ యేతర అప్పులుగా కేంద్రం చెప్పటం విశేషం. అసలు ఇది బడ్జెట్ లో పేర్కొనని అప్పు. ఇతర కార్పోరేషన్లు, సంస్థలు, ఇలా వాటి అన్నిటినీ తనఖా పెట్టి, ఈ అప్పులు తీసుకున్నట్టుగా కేంద్రం పేర్కొంది.
రాజ్యసభ సాక్షిగా కేంద్రం, అప్పుల లెక్కను చెప్పింది. మొత్తంగా బడ్జెట్ యేతర అప్పు, 2019-20 సంవత్సరానికి రూ. 56,076 కోట్లు అప్పుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొత్తంగా 12 బ్యాంకుల నుంచి ఈ అప్పు తీసుకున్నారు.
ఒక వైపు లెక్కలు చూపకుండా నిధులు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా మరో వైపు ఇలా దొడ్డి దోవన అప్పులు తీసుకువస్తున్నారనే ఆరోపణల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతున్నది.